ప్రజాశక్తి-నిమ్మనపల్లె పట్టుదల, క్రమశిక్షణ, అంకిత భావం కలిగి ఉంటే ఎంతటి లక్షాన్నైనా సాధించవచ్చునని కానిస్టేబుల్గా పని చేస్తూ ఎస్ఐ ఉద్యోగానికి ఎంపికైన మహిళా కానిస్టేబుల్ సుమతి నిరూపించారు. మదనపల్లె మండలం ఇసుకనూతపల్లికి చెందిన వేణుగోపాల్, భాగ్యమ్మ దంపతుల కుమార్తె బరినేపల్లి సుమతి మహిళ పోలీస్ కానిస్టేబుల్ గా నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఎస్ఐ ఎంపిక పరీక్ష తుది ఫలితాల్లో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. తండ్రి వేణుగోపాల్ కౌలు రైతు కాగా, తల్లి భాగ్యమ్మ పాడిఆవులు పోషించుకుంటూ జీవిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం కాగా మొదటి కుమార్తె అమరావతికి వివాహం అయింది, కుమారుడు రవికుమార్ వ్యాపారం చేస్తూ స్థిరపడ్డాడు. చివరి సంతానమైన సుమతి ప్రాథమిక విద్యాభ్యాసం ఇసుకనూతపల్లె ఎంపియుపి స్కూల్లోనూ, ఉన్నత విద్య మదనపల్లె జడ్పి హైస్కూల్లోనూ, ఇంటర్మీడియట్ విశ్వ సాధన కాలేజీలోచదివింది. మదనపల్లె జ్ఞానాంబిక కాలేజీలో 2017లో డిగ్రీ పూర్తి చేసింది. 2018 సంవత్సరంలో విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ద్వారా ఎంపికై, అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి డిపిఒ కార్యాలయంలోనూ, నిమ్మనపల్లె పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్ గానూ పనిచేశారు. 2022 డిసెంబర్లో విడుదలైన ఎస్ఐ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా రెండవ ప్రయత్నంలో ఎస్ఐ ఉద్యోగం సాధించింది. తన లక్ష్యాన్ని సాధించేందుకు తల్లిదండ్రులు కుటుంబ సభ్యులతో పాటు, ఎఎస్పి డాక్టర్ రాజ్కమల్, పోలీసు ఉన్నతా ధికారులు సహకారంతో పాటు ప్రోత్సాహం అందించారని సుమతి చెప్పారు. ఈ సందర్భంగా సహచర పోలీస్ సిబ్బంది,పలువురు ఆమెను అభినందించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/IMG-20231222-WA0265.jpg)