సమ్మె శిబిరంలో కార్మికులు
ప్రజాశక్తి-గుంటూరు : వేతనాల పెంచాల్సిందేనని, అలాగే ఇతర డిమాండ్లపై మంత్రుల బృందం చర్చల సందర్భంగా ఇచ్చిన హామీలకు అమలుకు తగిన చర్యలు తీసుకునే వరకూ సమ్మె కొనసాగుతుందని ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు స్పష్టం చేశారు. మున్సిపల్ కార్మికుల 13వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసన కొనసాగింది. ఈ సందర్భంగా ముత్యాలరావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తుంటే జీతాలు పెంచటం కుదరదని మంత్రుల బృందం చెప్పటం సరికాదన్నారు. ఇచ్చిన హామీలు ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టత లేదన్నారు. మున్సిపల్ కార్మికులందరికీ జీతాలు పెంచాలని, సమ్మె కాలం జీతాలు ఇవ్వాలని, సమ్మె సందర్భంగా పెట్టిన కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు కె.శౌరమ్మ, సామ్రాజ్యం, పి.శ్రీనివాసరావు, పి.పూర్ణచంద్రరావు, కె.మరియదాసు, కాటమరాజు, జి.ప్రసాదరావు, జి.శ్రీనివాసరావు, షరీఫ్, జానీ, పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/gnt-2-1.jpg)