రాష్ట్రంలో మొదటిసారిగా అపోలో ఆసుపత్రిలో ప్రారంభం
ప్రజాశక్తి – ఆరిలోవ : లుకోమియా, లింపోమా వంటి కొన్ని రకాల రక్త కేన్సర్లను పారదోలడానికి అధునాతన చిమెరిక్ యాంటిజెన్ రిసెప్టర్ (సిఎఆర్)-టి సెల్ అందుబాటులోకి వచ్చిందని ఆరిలోవ అపోలో ఆసుపత్రి ఆంకాలజీ విభాగం వైద్యనిపుణులు వెల్లడించారు రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఈ వైద్యవిధానంలో ఒక లుకోమియా రోగికి వైద్యం చేశామని వెల్లడించారు. గురవారం అపోలో ఆసుపత్రిలో మీడియాతో అంకాలజిస్ట్లు డాక్టర్ బోయ రాకేష్రెడ్డి, సిఇఒ రామచంద్ర, డాక్టర్ అరుణ్కుమార్ మాట్లాడుతూ, ఇప్పటివరకు కేన్సర్ వ్యాధి నివారణకు ఆపరేషన్, కిమోథెరపీ, రేడియేషన్ వంటి వైద్యవిధానాలను అవలంభించే వాళ్లమన్నారు. ఇపుడు కేన్సర్ రోగులకు వరంలా కార్-టి సెల్ థెరపీ అందుబాటులోకి వచ్చిందన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ వైద్య విధానం ద్వారా ఆరిలోవ అపోలో ఆసుపత్రిలో లుకోమియా రోగికి వైద్యం చేసామని వెల్లడించారు. శరీరంలో రక్తంలోని టి-సెల్స్ను సేకరించి, ప్రయోగశాలలో మెడికల్ ఇంజినీరింగ్ నైపుణ్యంతో కేన్సర్ను సమర్థవంతంగా ఎదుర్కొనే కణాలుగా వాటిని అభివృద్ధి చేసి, తిరిగి మనిషి శరీరంలోకి వాటిని ప్రవేశపెడతారు. వీటికున్న స్వీయరక్షణ సామర్థ్యంతో శరీరంలోని కేన్సర్ కారక కణాలను నశింపజేయడంతోపాటు, కొత్త కణాల రాకుండా అడ్డుకోవడంతో ప్రముఖపాత్ర పోషిస్తాయన్నారు. కార్-టి సెల్ థెరపీ కొన్ని రకాల కేన్సర్ రోగులకు వరం కానుందని వెల్లడించారు.
మాట్లాడుతున్న అపోలో ఆంకాలజిస్ట్లు