మాట్లాడుతున్న డిఎంహెచ్ఒ
గర్భిణులకు సకాలంలో వైద్యపరీక్షలు
ప్రజాశక్తి-నెల్లూ :రుగర్భం దాల్చిన ప్రతి మహిళ పేరును వైద్య ఆరోగ్య శాఖ రికార్డులల్లో నమోదు చేసుకోవాలని, అదే సమయంలో సకాలంలో వారందరికీ వైద్యపరీక్షలు అందజేసేందుకు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టరు ఎం.పెంచలయ్య సిబ్బందికి సూచించారు. మంగళవారం నగరంలోని డిఎంఅండ్ హెచ్ఓ కార్యాలయంలో ‘మాతా శిశు మరణాల సబ్కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిఎంఅండ్హెచ్ఓ డాక్టరు ఎం.పెంచలయ్య అధ్యక్షత వహించారు. ఈసందర్భంగా ఇటీవల జిల్లాలో సంభవించిన మాతృ, శిశు మరణాలపై ఎండిఆర్ అండ్ సిడిఆర్ కమిటీ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్లిష్టతరమైన గర్భవతులపై ప్రభుత్వ వైద్యులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. తద్వారా మాతృమరణాలను నివారించడం సాధ్యమౌతుందన్నారు. తల్లికి పోషకాహార ప్రాధాన్యత తెలియజేయాలన్నారు. తల్లి పాల ప్రాముఖ్యతను తెలియజేసి పుట్టిన వెంటనే పాలను శిశువుకు పట్టించేలా అవగాహన కల్పించాలన్నారు. ప్రయివేట్ వైద్యశాలల్లో ప్రసవిస్తున్న తల్లులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డాక్టరు గీతాలక్ష్మి, ఐవి రామచాంద్రరావు, డాక్టర్ ఖాదర్వల్లి, డాక్టరు సెలీనాకుమారి, డాక్టరు సింధుజ, బ్లడ్ బ్యాంకు డాక్టరు ఉమాదేవి, అనస్థిషియా వైద్యులు డాక్టరు బి.శ్రీనివాసరావు, మంజులమ్మ, ప్రాథమిక వైద్యశాల వైద్యసిబ్బంది, నారాయణ వైద్యశాల డాక్టర్లు పాల్గొన్నారు.