ఎంపి శ్రీకృష్ణదేవరాయలను సత్కరిస్తున్న పత్తిపాటి పుల్లారావు, ఇతర టిడిపి నాయకులు
ప్రజాశక్తి – చిలకలూరిపేట : రానున్న ఎన్నికల్లో గెలుపు అనివార్యమని, అందుకే పార్టీ శ్రేణులంతా చిత్తశుద్ధితో పని చేయాలని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపునిచ్చారు. ఎన్నికల సంసిద్ధతపై పండరిపురంలోని టిడిపి కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో పుల్లారావు మాట్లాడుతూ చిలకలూరిపేటలో వైసిపి చేసిన అభివృద్ధి ఏమీ లేదని, పైగా టిడిపి చేపట్టిన పెండింగ్ పనులను వదిలేసిందని అన్నారు. ఐదేళ్లలో బైపాస్ కూడా పూర్తి చేయలేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే వీటిని పూర్తి చేస్తామని చెప్పారు. జనసేన, బిజెపితో సమన్వయం చేసుకుంటూ ఇంటింటి ప్రచారం చేయాలని, యువతను సమీకరించాలని చెప్పారు. శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ తనకు వివాదాలు, ఘర్షణలంటే నచ్చవని, అభివృద్ధికే ప్రాధాన్యమిస్తానని చెప్పారు. వివాదాలకు తావివ్వకుండా అందర్నీ కలుపుకెళ్లేలా వ్యూహాలు సిద్ధం చేయాలన్నారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. టిడిపి ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో పాటు తన మార్కు అభివృద్ధిని చేసి చూపిస్తానన్నారు. ఈ సందర్భంగా మండలం కోమటినేనివారిపాలేనికి చెందిన సీనియర్ నాయకులు నల్లూరి సాంబశివరావు వైసిపిని వీడి టిడిపిలో చేరారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/cpt-2-2.jpg)