ప్రజాశక్తి – బెలగాం : గిరిజన పిల్లలకు ఆధార్ కార్డుల కోసం జనన ధ్రువపత్రాలు ఇవ్వాలని కోరుతూ గిరిజన పిల్లల తల్లిదండ్రులతో కలిసి సోమవారం స్థానిక ఆర్డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ ధర్నానుద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు వి.ఇందిర మాట్లాడుతూ మాట్లాడుతూ పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ పనసభద్ర గ్రామానికి చెందిన పిల్లలకు జనన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఆధార్ కార్డు మంజూరు కాక విద్య, వైద్యం, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు గిరిజన విద్యార్థులు దూరంగా ఉండే పరిస్థితి ఉందని అన్నారు. కావున తక్షణమే అధికారులు స్పందించి జనన ధ్రువీకరణ పత్రం అందజేయాలని కోరారు. అనంతరం ఆర్డిఒ కె.హేమలతకు వినతిని అందజేశారు. దీనికి ఆమె స్పందిస్తూ ఐటిడిఎ కార్యాలయం వద్ద ఉన్న ఆధార్ సెంటర్కు వెళ్లి మీ సమస్య పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. వినతిని అందజేసిన వారిలో సిపిఎం నాయకులు కె.సాంబమూర్తి, ఆర్.ఈశ్వరరావు, కె.ఈశ్వరరావు, తోపుడు బళ్ళు సంఘం పట్టణ అధ్యక్షులు సూరిబాబు, గిరిజన సంఘం జిల్లా నాయకులు పి.రాము, నాయకులు, పనసభద్ర గ్రామస్తులు పాల్గొన్నారు.