ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : జాతీయ స్థాయి ఇన్స్పైర్ పోటీలకు జిల్లా నుంచి రెండు ప్రాజెక్టులు ఎంపికైనట్లు జిల్లా సైన్స్ అధికారి ఎం.కృష్ణారావు తెలిపారు.ఈనెల 11 నుంచి 13 వరకు చిత్తూరు జిల్లా పలమనేరులో రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనాక్ పోటీలు జరిగాయని తెలిపారు. రాష్ట్రం మొత్తం 306 ప్రాజెక్టులు ప్రదర్శించగా అందులో 24 ప్రాజెక్టులు జాతీయస్థాయికి ఎంపికయ్యాయని చెప్పారు. రేగిడి ఆమదాలవలస మండలం సంకిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రూపొందించిన బహుళార్థ సాధక అధునాతన సుత్తి, కొత్తవలస మండల కేంద్రం మహాత్మా జ్యోతిభా ఫూలే గురుకులం విద్యార్థి జి.పూజిత రూపొందించిన జీవ సంచులు అనే ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి దేవరాజు చేతుల మీదుగా వీరు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందుకున్నారన్నారు. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థులను, వారికి గైడ్ చేసిన ఉపాధ్యాయులను డిఇఒ ప్రేమకుమార్, జిల్లా సైన్స్ అధికారి కృష్ణారావు అభినందించారు.