మండపేటలో మోకాళ్లపై నిరసన తెలుపుతున్న అంగన్వాడీలు
ప్రజాశక్తి-మండపేట
న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన సమ్మెలో భాగంగా మోకాళ్లపై శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలువురు అంగన్వాడీ నాయకులు మాట్లాడతుఊ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. సమస్యలు పరిష్కరించకుండానే సెంటర్లు తెరవాలని ప్రభుత్వం కలెక్టర్ ల ద్వారా ఆదేశాలు జారీ చేస్తుందని సెంటర్లు తెరవకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని ప్రభుత్వం చెబుతుందని ఇటువంటి తాటాకు చప్పుళ్లకు అంగన్వాడీలు భయపడేదిలేదన్నారు. అంగన్వాడీలకు అన్ని ఇచ్చామని ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆమె ఖండించారు. సమస్యలు పరిష్కరించుకుంటే అంగన్వాడీ కేంద్రాలు తెరిచేది లేదని స్పష్టం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మెను మరింత ఉధతం చేస్తామని హెచ్చరించారు. కనీస వేతనం రూ.26వేలు, గ్రాడ్యుటీ, పిఎఫ్ అందించడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అంగన్వాడీలు నాయకులు రాణి, బేబీ, వజ్రం, సూర్యకుమారి, రాణి, కుమారి తదితరులు పాల్గొన్నారు.