ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య
తాళాలు పగలగొట్టిన వారిని అరెస్టు చేయాలి
ప్రజాశక్తి-ఉదయగిరి : అంగన్వాడీలను భయభ్రాంతులకు గురిచేస్తూ బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టిన వారిని వెంటనే అరెస్టు చేయాలని సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య, టిడిపి మండల అధ్యక్షులు బయన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం 8వ రోజు తహశీల్దార్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరవధిక సమ్మెను కొనసాగించారు. ఈ సందర్భంగా అంగన్వాడీల న్యాయమైన కోరికల కోసం చేపడుతున్న సమ్మెకు టిడిపి నాయకులు మద్దతు తెలిపి మాట్లాడుతూ టిడిపిలోనే అంగన్వాడీలను అప్పటి ప్రస్తుత నిత్యావసర ధరలకు అనుగుణంగా రూ.10వేల వేతనం పెంచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కిందన్నారు. మాట తప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు మరిచి వారిని రోడ్డు ఎక్కేలా చేశారని దుయ్యబట్టారు. సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య మాట్లాడుతూ అంగన్వాడీ సెంటర్లను దౌర్జన్యంగా బలవంతంగా తాళాలు పగలకొట్టడం ప్రభుత్వ నిరంకుశ పాలనకు అద్దం పట్టినట్లు కనిపిస్తుందన్నారు. అంగన్వాడీలకు న్యాయం చేకూరేంత వరకు అన్ని శాఖల అధికారులు జిల్లా ఉన్నత అధికారులు మద్దతు తెలిపి వారి న్యాయమైన కోరికలను తీర్చేందుకు కృషి చేయాలన్నారు. అక్రమంగా తాళాలు పగలగొట్టే వారిని అరెస్టు చేయాలన్నారు. జరిగే పార్లమెంటు సమావేశంలో అంగన్వాడీల సమస్యలు చర్చించి సమస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో టిడిపి బిసిసెల్ నాయకులు మతకాల శ్రీను, మాజీ సర్పంచ్ వెంకటస్వామి, అంగన్వాడీ ప్రాజెక్ట్ అధ్యక్షరాలు ప్రమీల, నాయకులు రమాదేవి, విద్యార్థి సంఘ నాయకురాలు కళ్యాణి, సిఐటియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
![ఫొటో : మాట్లాడుతున్న సిఐటియు నాయకులు కాకు వెంకటయ్య](https://prajasakti.com/wp-content/uploads/2023/12/udg-3-scaled.jpg)