ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్ : మున్సిపాల్టీ పరిధిలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేసి పారిశుధ్య పనులను చేపట్టాలని మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ నాగరాజు అన్నారు. మంగళవారం స్థానికమున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయన కమిషనర్ కె.శ్రీనివాస్, డిఇ కిరణ్ కుమార్, ప్రజారోగ్య అధికారి సిహెచ్ మురళిలత కలిసి డంపింగ్ యార్డును, గ్యాస్ ఆధారిత స్మశాన వాటికను, బెలగాంలో ఉన్న ప్రజారోగ్య విభాగం రెండో కార్యాలయంలో వ్యర్ధాలను శుద్ధి చేసే యంత్రాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రీజియన్లో 85 శాతం పన్నులు వసూలు జరిగాయన్నారు. పట్టణంలో 30 వార్డుల్లో పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, అపార్ట్మెంట్లు, హాస్టళ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద చెత్తలను, వ్యర్ధాలను సేకరించి ఆ ప్రాంతంలోనే సేంద్రియ ఎరువులను తయారు చేసేలా కృషి చేయాలని, అసంపూర్తిగా నిలిచిపోయిన గ్యాస్ ఆధారిత శ్మశాన వాటిక పనులను 15వ ఆర్థిక సంఘం నిధులను వేచ్చించి పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వేసవి దృష్ట్యా తాగునీరు సరఫరా సక్రమంగా ఇవ్వాలన్నారు. ప్రజారోగ్య విభాగంలో డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులు అర్డిని కలిసి తమను డ్రైవర్లుగా గుర్తించాలని కోరడంతో, పార్టీ స్పందిస్తూ ప్రభుత్వానికి నివేదిక పంపి వీరిని డ్రైవర్లుగా గుర్తించాలని కమిషనర్కు సూచించారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/comm.jpg)