సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్
ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు అన్ని పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్, లైటింగ్, ర్యాంపులు, మరుగుదొడ్లు తదితర సదుపాయాలను కల్పించామని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్.శివశంకర్ చెప్పారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమావేశం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కలెక్టరేట్లో ఎస్.ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం నిర్వహించారు. ఓటరు జాబితాల ప్రచురణ అనంతరం నమోదు, తొలగింపులు, సవరణల కోసం అందిన ధరఖాస్తుల పరిష్కారం, ఇవిఎంలు, వివిపాట్ల వినియోగంపై ఓటరు అవగాహనా కార్యక్రమాలు, డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు, స్ట్రాంగ్ రూమ్ల ఏర్పాటు, మోడల్ కోడ్ టీమ్లు, వ్యయ పరిశీలన టీంల ఏర్పాటు, వృద్ధులు, వికలాంగులకు హోమ్ ఓటింగ్ సదుపాయం, క్రిటికల్ పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై కలెక్టర్ వివరించారు. ఎన్నికల నిర్వహణకు ఎంసిసి, ప్లయింగ్ స్క్వాడ్, స్టాసిటిక్ సర్వేలెన్స్, వీడియో సర్వైలెన్స్, అకౌంటింగ్ టీములు, ఎఈఓల నియామకం పూర్తయిందన్నారు. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఈ బృందాలు పనుల ప్రారంభిస్తాయన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్లు, 40 శాతం పైబడిన వైకల్యం కలిగిన ఓటర కోసం హోమ్ ఓటింగ్ వెసులుబాటును ఫారమ్-డి ధరఖాస్తు ద్వారా వినియోగించుకునే విధానంపై అవగాహన కల్పించారు. ఇన్ఛార్జి డిఆర్ఒ అజరు కుమార్, కలెక్టరేట్ సి సెక్షన్ హెచ్ఒడి టి.రవి, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/pnd-373.jpg)