ప్రజాశక్తి – కొమరాడ : పౌష్టికాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జెడ్పిటిసి సభ్యులు ద్వారపురెడ్డి లక్ష్మి, ఐసిడిఎస్ పిడి రాణి అన్నారు. పోషకాహార పక్షోత్సవాల్లో భాగంగా మండలంలోని గంగరేగువలస సెక్టార్ పరిధిలోగల గంగరేగువలస అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తలతో పోషణ పక్వాడ కార్యక్రమంపై శుక్రవారం ర్యాలీ, మానవహారం ద్వారా అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల పరిధిలో గల గర్భిణులకు సీమంతాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నోడల్ అధికారి జి.చిన్మయి దేవి మాట్లాడుతూ ఈ 15 రోజులు ప్రతి అంగనవాడీ కేంద్రం వద్ద ప్రతిరోజు గర్భిణిలకు, బాలింతలకు, కిశోర బాలికలకు, పిల్లలకు పోషకాహార ప్రాముఖ్యత గురించి తెలియజేయాలని అంగన్వాడీ కార్యకర్తలకు సూచించారు. అలాగే పిల్లల్లో మేధాశక్తి, చురుకుదనం పెంపొందించేలా ఆటపాటలతో కూడిన విద్య, ఆహారపు అలవాట్లు పెంపొందించేలా కృషి చేయాలన్నారు. పోషకాహారాన్ని పిల్లలు, గర్భిణులు, బాలింతలు పూర్తి స్థాయిలో వినియోగించుకొని రక్తహీనత నివారణకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో కొమరాడ ప్రాజెక్టు పిఒ సుగుణ, బొబ్బిలి పిఒ, సూపర్వైజర్ శారద, సెక్టార్ యూనియన్ నాయకులు అలివేలు, కార్యకర్తలు అనురాధ, సుజాత హెల్పర్లు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. గరుగుబిల్లి : కొమరాడ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మండలంలోని ఉల్లిభద్రలో శుక్ర వారం అంగన్వాడీ వర్కర్లు ఏర్పాటు చేసిన పౌష్టికాహారం స్టాల్ను ఎంపిడిఒ పైల సూర్యనారాయణ, సర్పంచ్ శెట్టి దివ్యలక్ష్మి సందర్శిం చారు.. అనంతరం ఎంపిడిఒ మాట్లాడుతూ గర్బిణులు, బాలింతల్లో రక్తహీనతను నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందజేస్తున్న పౌష్టికాహారాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. సర్పంచ్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా వైయస్సార్ సంపూర్ణపోషణ, పోషణప్లస్ కార్యక్రమం కింద గర్భిణులు, బాలింతలకు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో గరుగుబిల్లి పిహెచ్సి హెల్త్ విజిటర్ చింతాడ ఉదయకుమారి, సూపర్వైజర్లు రౌతు లక్ష్మి, అంగన్వాడి వర్కర్లు మరడాన కల్పన, ఎస్.లావణ్య, సునీత, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/icds-kmd.jpg)