ఎఐఐఇఎ జాతీయ మాజీ కార్యదర్శి వేణుగోపాల్
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ప్రభుత్వ రంగ సంస్థలను కాపడుకోడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భావించాలని ఆలిండియా ఇన్సూరెన్సు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఎఐఐఇఎ) జాతీయ మాజీ కార్యదర్శి కె.వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వ రంగం ఉంటేనే హక్కులు ఉంటాయని, అందుకోసం అన్ని వర్గాల ప్రజలనూ కలుపుకొని ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. విజయనగరం ఎల్ఐసి బ్రాంచిలో అసిస్టెంట్గా పనిచేస్తూ యూనియన్ నాయకుడిగా ఉన్న ఎం.శ్రీనివాస ఉద్యోగ విరమణ సందర్భంగా శుక్రవారం స్థానిక రెవెన్యూ హోంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వేణుగోపాల్తో పాటు మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ పాల్గొన్నారు. ప్రభుత్వ సంస్థల ప్రాధాన్యత అనే అంశంపై వేణుగోపాల్ మాట్లాడుతూ నేడు ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసి అని అన్నారు. గుడ్ విల్ విషయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉందన్నారు. నేడు అధికారంలో ఉన్న మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ రంగ సంస్థలు చనిపోయిన సంస్థలు అని వ్యాఖ్యనించారని గుర్తు చేశారు. ఆయన ప్రధాని అయిన తర్వాత ఎల్ఐసి నుంచి డివిడెండ్ రూపంలో రూ.56వేల కోట్లును మోడీ ప్రభుత్వం తీసుకుందన్నారు. ఎల్ఐసి, స్టీల్ ప్లాంట్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మన బాధ్యతగా బావించాలన్నారు. ఎల్ఐసిని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం చూస్తోందన్నారు. ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించిన వారిపై కేంద్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వ విధానాలు ఎల్ఐసికి ప్రతికూలంగా ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దానిని వ్యతిరేకిస్తామని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసే విధానాలు అమలు చేస్తున్న బిజెపికి ఓటు వేశామంటే మన మనుగడను మనమే లేకుండా చేసుకున్నవారం అవుతామన్నారు. 1984లో ఎల్ఐసిని ఐదు ముక్కలు చేయాలని ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రయత్నిస్తే అప్పటి సిపిఎం ఎంపీలు దాని యొక్క ప్రాధాన్యత పార్లమెంట్లో చెప్పి ముక్కలు కాకుండా కాపాడారని గుర్తు చేశారు.
అనంతరం ‘మధ్యతరగతి ఉద్యోగులు- కర్తవ్యాలు’ అనే అంశంపై మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ మాట్లాడుతూ మధ్యతరగతి ఉద్యోగులు మెరుగైన సమాజం కోసం ప్రజల్లో చైతన్యం,అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. మనం ఉద్యోగాలు చేసి రాజ్యాంగం ద్వారా అనేక హక్కులు పొందుతున్నామో నేడు అదే రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ రంగ సంస్థలను, రాజ్యాంగాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలే నియంతృత్వ పాలన సాగిస్తున్నాయన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ఆ పని చేయలేనప్పుడు ఆ బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో పలువురు ఎల్ఐసి యూనియన్ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు పాల్గొన్నారు.