ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : ఉపాధ్యాయులకు సంబంధించి పిఎఫ్, ఎపి జిఎల్ఐ, పిఅర్సి, ఇఎల్, డిఎలకు బకాయిలు రూ.18 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం సాయంత్రం స్థానిక కోట జంక్షన్ నుంచి మూడు లాంతర్లు, ఎంజి రోడ్డు మీదుగా గంటస్థంబం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి జెఎవిఅర్కె ఈశ్వరరావు మాట్లాడుతూ యుటిఎఫ్ చేసిన పోరాట ఫలితంగా రూ.1200 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. మిగతా బకాయి నేటికీ చెల్లించకపోవడం దారుణమన్నారు. అవసరాలు కోసం దాచుకున్న డబ్బులను ఇవ్వకుండా ఉద్యోగులతో రాష్ట్ర ప్రభుత్వం ఆటలాడుకుంటుందన్నారు. వెంటనే మొత్తం బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో యుటి ఎఫ్ నాయకులు,ఉపాద్యాయులు పాల్గొన్నారు. గజపతినగరం : బకాయిలు చెల్లించాలని కోరుతూ మండల కేంద్రంలో యుటిఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి చింత భాస్కరరావు, రాష్ట్ర కౌన్సిలర్ కిల్లాడ అప్పారావు, జిల్లా సిపిఎస్ జిల్లా కన్వీనర్ పి.రాంప్రసాద్, గజపతినగరం మండల కార్యదర్శి జగదీష్, మెంటాడ, బొండపల్లి, దత్తిరాజేరు మండలాల నాయకులు కె.సత్యనారాయణ, పి.శ్రీనివాసరావు, జి.వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/01/utf-8.jpg)