ప్రజాశక్తి – కడప అర్బన్ రాష్ట్రవ్యాప్తంగా ఐఎంల్ డిపోలో పనిచేస్తున్న బేవరేజ్ హమాలీ కార్మికులకు ఎగుమతి రేట్లు గత అక్టోబర్లో పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, హామీని వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ డిమాండ్ చేశారు. మంగళవారం కడప ఐఎంఎల్ డిపో వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు కావడంలో ఎక్సైజ్ శాఖ ప్రధానమైనటువంటి ఆదాయ వనరు అని తెలిపారు. బేవరేజ్ హమాలీలు ట్రాన్స్పోర్టు వెహికల్స్ కు ఎగుమతి చేయడం, దిగుమతి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎక్సైజ్ శాఖ అధికారులు 2023, అక్టోబర్ చివరి లోపు పెంచుతామని హామీ ఇచ్చారని తెలిపారు. మరల డిసెంబర్ 15వ తేదీ లోపు కచ్చితంగా పెంచుతామని చెప్పారన్నారు. 2024, ఫిబ్రవరి దాటినా ఎక్సైజ్ అధికారులు, ప్రభుత్వం పెంచకపోవడం వల్ల డిపోల వద్ద ధర్నా చేయాల్సిన అవసరం వచ్చిందని పేర్కొన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని తెలిపారు. ఐఎంఎల్ డిపో వద్ద హామాలీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉంటారని చెప్పారు. బాటల్స్ దించడంలో, ఎత్తడంలో ప్రమాదం జరుగు తున్నటువంటి పరిస్థితి ఉందని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాద బీమా వర్తింప జేయాలని డిమాండ్ చేశారు. హమాలీల ఎగుమతి రేట్లు పెంచ కపోతే సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మార్చి 4 వ తేదీ ఆందోళన చేస్తామని హెచ్చ రించారు. ఐఎంఎల్ బేవరేజ్ హమాలి యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వి.వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. డిపో గౌరవ అధ్యక్షులు పి. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ హమాలీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ధర్నాలో కె. రఘురామయ్య, జి.రెడ్డి ప్రసాద్, ఎన్.వి. సుబ్బారెడ్డి, ఎన్. సుబ్బారెడ్డి, పి.వి.రమణ, పిఓ కొండారెడ్డి, ఎ.నరేష్, ఎన్. మదన్, ఎల్.మనోహర్ పాల్గొన్నారు.
బేవరేజ్ హమాలీలకు కూలి రేట్లు పెంచాలి – సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/4-57.jpg)