ప్రజాశక్తి-మండపేట (అంబేద్కర్ కోనసీమ) : మండపేట పట్టణంలో ఆదిత్య, విజ్ఞాన్ కళాశాలతో పాటు స్థానిక మారేడుబాక రోడ్డులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రూప్ 2 పరీక్ష ఆదివారం పకడ్బందీగా నిర్వహించారు. ఈ పరీక్షకు 850 మంది అభ్యర్థులు హాజరు కావలసి ఉండగా 181 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. 669 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన చోటుచేసుకోకుండా పోలీసులు ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ఆదిత్య కాలేజీ వద్ద పట్టణ ఎస్ఐ హరికోటి శాస్త్రి తన సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. డిఎల్డివో శాంతి, తహశీల్దార్ సురేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ బి.రాము, మండల అభివృద్ధి అధికారి కే.శ్రీదేవి ఏర్పాట్లను పరిశీలించారు.