ప్రజాశక్తి- అనకాపల్లి
జిల్లాలో వ్యవసాయ అనుబంధ రంగాల రైతులకు మరింత ఎక్కువగా రైతు రుణాలు మంజూరు చేయించాలని జిల్లా కలెక్టర్ రవి పట్టణన్ శెట్టి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా వ్యవసాయ సలహా మండల సమావేశంలో చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కల్పించే రుణ సదుపాయాలను గూర్చి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలన్నారు. అర్హత ఉన్న వారిలో అవసరమైన వారందరికీ వ్యవసాయ పశుసంవర్ధక మత్స్య ఉద్యానవన, బిందు సేద్య మొదలగు శాఖలకు సంబంధించి రుణాలను సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎటువంటి సమస్యలకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలన్నారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ చిక్కాల రామారావు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు, వివిధ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కు అధికారులు దిశానిర్దేశం చేయాలన్నారు. అనంతరం వ్యవసాయ శాఖ డైరీ, క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో సలహా మండలి సభ్యులు ఎస్ .రమణ, ఏ.సూరి అప్పారావు వ్యవసాయ శాఖ జేడీ మోహనరావు, సహకార బ్యాంకు మేనేజర్ వర్మ, పశుసంవర్ధక శాఖ జెడి ప్రసాద రావు, మత్స్య శాఖ డిడి ప్రసాద్, ఉద్యానవన శాఖ డిడి ప్రభాకర్ రావు, ఏపీఎంఐపీ ఏడి జీవీ లక్ష్మి, డీఎస్ఓ కె వి ఎల్ ఎన్ మూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ సత్యనారాయణ, తదితర శాఖల అధికారులు వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.