ప్రజాశక్తి – కలెక్టరేట్ : మున్సిపల్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం యుటిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శులు కె.భాస్కరరావు, ఎన్.శ్రీనివాస రావు మాట్లాడుతూ మున్సిపల్ ఉపాధ్యాయుల దీర్ఘకాల సమస్యలు పరిష్కరించాలని ఇప్పటికే యుటిఎఫ్ విద్యాశాఖ అధికారులకు విజ్ఞప్తి చేసిందన్నారు. అయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలోనే డిఇఒ కార్యాలయం వద్ద నిరసన చేపట్టినట్టు తెలిపారు. మున్సిపల్ ఉపాధ్యాయులకు పిఎఫ్ ఖాతాలు తెరవాలని, బదిలీలు, పదోన్నతులు తక్షణమే చేపట్టాలన్నారు. అన్ని పాఠశాలలకు బోధనేతర సిబ్బందిని నియమించాలని, ఉన్నత పాఠశాలల్లో అన్ని పోస్టులు అప్గ్రేడ్ చేయాలని, మెడికల్ బిల్లులు కొత్త డిడిఒల ద్వారా అనుమతించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారానికి పైస్థాయి అధికారులకు డిఇఒ ద్వారా తెలియజేయాల్సింది కోరారు. నిరసనలో యుటిఎఫ్ జిల్లా కౌన్సిలర్ డి.పోలినాయుడు, పట్టణ శాఖ ప్రధాన కార్యదర్శి కె.హరికష్ణ తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/utf-1.jpg)