ప్రజాశక్తి-కనిగిరి : మెగా డిఎస్సిని ప్రకటించాలని యుటిఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. డిఎస్సిని ప్రకటించాలని కోరుతూ డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు నరేంద్ర ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం చేపట్టారు. ఆర్డిఒ జాన్ ఇర్విన్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ రాష్ట్ర నాయకుడు మీగడ వెంకటేశ్వర రెడ్డి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు పిసికేశవరావు మాట్లాడుతూ సిఎం జగన్ అధికారంలోకి రాకముందు మెగాడిఎస్సి నిర్వహిస్తామని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను మరచి నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారన్నారు. ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారన్నారు. వెంటనే డిఎస్సి నిర్వహించకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు శ్రీను, నారాయణ, వలి ,శివ ,రమణయ్య, బాలకాశయ్య, డిఎస్సి అభ్యర్థులు రవి ,కళ్యాణ్, రఫీ తదితరులు పాల్గొన్నారు.