ప్రజాశక్తి- కొత్తపట్నం : ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. మండల పరిధిలోని అల్లూరు గ్రామ సచివాలయాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటి పట్టాల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించారు. వివరాలను అడిగి తెలు సుకున్నారు. అనంతరం కలెక్టర్, పలువురు లబ్ధిదారులతో మాట్లాడారు. ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ ఆవశ్యకత గురించి వారికి వివరించారు. అల్లూరు గ్రామంలోని జగనన్న లేఅవుట్లో 318 మందికి ఇంటి పట్టాలు మంజురు చేసినట్లు తెలిపారు. అందులో ఇప్పటి వరకు 186 మందికి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు తహశీల్దారు సురేష్, జిల్లా కలెక్టర్కు వివరించారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం తహశీల్దారు సురేష్, ఎంపిడిఒ ఫణి కుమార్ నాయక్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.