రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న మంత్రి పినిపే విశ్వరూప్
ప్రజాశక్తి-అమలాపురం రూరల్
సార్వత్రిక ఎన్నికల లోపుగా స్థానిక అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో అన్ని సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ పేర్కొన్నారు. బుధవారం బండారులంక గ్రామం నుండి దంగేటి వారి పాలెం వరకు సిసి రోడ్ నిర్మాణ పనులకు పాలగుమ్మి- చప్పిడి వారి పాలెం సిసి రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.2.5కోట్ల మేర సిసి రోడ్ల పనులకు శంకుస్థాపన చేశామన్నారు. కొన్ని సిసి రోడ్ల నిర్మాణాల పనులు టెండర్ దశలో ఉన్నాయని వాటిని కూడా సంక్రాంతి లోపు పూర్తి చేసేందుకు రహదారులు భవనాల శాఖ అధికారులను ఆదేశించామన్నారు. కార్యక్రమంలో ఎంఎల్సి కుడిపూడి సూర్యనారాయణ రావు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్ దంగేటి డోలామణి రుద్ర, ఎంపిపి కుడుపూడి భాగ్యలక్ష్మి, జెడ్పిటిసి సభ్యుడు పందిరి శ్రీహరి వేణుగోపాల్, ఆర్ అండ్ బి డివిజనల్ ఇంజనీర్ రాఘవరావు, సర్పంచులు, వైసిపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.