ప్రజాశక్తి – కాకినాడరూరల్
సామాజిక కార్యకర్తగా, దంత వైద్యుడిగా పేదలకు పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న డాక్టర్ అడ్డాల సత్యనారాయణ సేవా తత్పరుడని విశ్రాంతి ఉపాధ్యాయుడు నిమ్మకాయల వెంకటేశ్వరరావు కొనియాడారు. స్థానిక ఎపిఐఐసి కాలనీ అడబాల ట్రస్ట్ కార్యాలయంలో సత్యా డెంటల్ క్లినిక్ 25వ వార్షికోత్సవం సందర్భంగా డాక్టర్ అడ్డాల 25 మంది వృద్ధులకు నూతన వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఏ స్వచ్ఛంద సేవా సంస్థ అయినా ఉచిత వైద్య శిబిరం నిర్వహించాలంటే దానికి పూర్తి సహకారం అందించి విజయవంతం చేసేది డాక్టర్ అడ్డాల అని అన్నారు. డాక్టర్ అడ్డాల మాట్లాడుతూ దంత వైద్య రంగంలో వస్తున్న ఆధునికతను ఎప్పటికప్పుడు ఆచరిస్తూ అందరికీ అందుబాటులో దంత వైద్యం తీసుకురావాలన్నదే తన లక్ష్యమని అన్నారు . అనంతరం అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ అడ్డాల దంపతులను ఘనంగా సత్కరించారు.