ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఔట్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. సమ్మె సందర్భంగా శనివారం కలెక్టరేట్ వద్ద ధర్నా శిబిరంలో మోకాళ్ళపై నిలబడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష జెఎసి జిల్లా అధ్యక్షులు గురువులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలుచేయాలని కోరుతుంటే సమస్యలు పరిష్కారం చేయకుండా నిర్లక్ష్యం చేయడం దారుణమన్నారు. మరో వైపు సమస్యలు పరిష్కారం చేయకుండా కెజిబివి ఉద్యోగులకు మెమోలు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఏ ఒక్క ఉద్యోగిపై చర్యలు తీసుకున్నా తామంతా మూకుమ్మడిగా ఉద్యోగ బాధ్యతలను నుంచి తప్పుకుంటామని హెచ్చరించారు 11 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం సమస్యలు పరిష్కారం కోసం ముందుకు రాకపోవడం చాలా దారుణమన్నారు. జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత కల్పించి ప్రతి నెలా 1వ తేదీకి వేతనాలు చెల్లించి, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలన్నారు.వేతనంతో కూడిన మెడికల్ లీవులుమంజూరు చేయాలని, గ్రాడ్యుటీ మరియు 20లక్షల రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శ్రీనివాసరావు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/ssa-13.jpg)