ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం: రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వైసిపి నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పూరించిన నాధమే శంఖారావమని కురుపాం నియోజకవర్గం టిడిపి ఇన్ఛార్జి తోయక జగదీశ్వరి అన్నారు. ఈ సందర్భంగా ఈనెల 13న గరుగుబిల్లి మండలం ఉల్లిభద్ర వద్ద జరిగే బహిరంగ సభలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఆమె కోరారు. శనివారం గుమ్మలక్ష్మీపురంలో ఆమె స్వగృహం వద్ద మండల టిడిపి అధ్యక్షులు పాడి సుదర్శనరావు అధ్వర్యంలో టిడిపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు తెలుగుదేశం పార్టీ ‘శంఖారావం’ అనే కీలక ప్రచారానికి శ్రీకారం చుట్టిందన్నారు. దీని ద్వారా కార్యకర్తలు నేరుగా నారా లోకేష్కు తమ అభిప్రాయాలను పంచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. ఇప్పటికే యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో లోకేశ్ పర్యటించారని, జగస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలపైనా, అరాచక పాలనపై గొంతెత్తి ప్రజలకు మద్దతుగా నిలిచారని అన్నారు. శంఖారావంతో కార్యకర్తలు నారా లోకేష్ వైపు మరింత చేరువయ్యేలా చేస్తుందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో కురుపాం నియోజకవర్గం జనసేన సమన్వయకర్త కడ్రక మల్లేశ్వరరావు ఉన్నారు.భామిని : ఈనెల 13న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శంఖారావం కార్యక్రమంలో భాగంగా పాలకొండలో పాల్గొనున్నారని, దీన్ని జయప్రదం చేయాలని పాలకొండ నియోజకవర్గ టిడిపి ఇన్ఛార్జి నిమ్మక జయకృష్ణ తెలిపారు. ఈ మేరకు భామినిలో కార్యకర్తలు, నాయకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని టిడిపి-జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొని, శంఖారావం సభను విజయవంతం చేయాలని కోరారు. మండల టిడిపి అధ్యక్షులు భోగాపురపు రవినాయుడు, నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నిమ్మల నిబ్రం, మండల ప్రధాన కార్యదర్శి మెడిబోయిన జగదీశ్, మండల జనసేన అధ్యక్షులు రుంకు కిరణ్, సర్పంచ్ లోపింటి రాజేష్, నాయకులు గుదుబిల్లి లక్ష్మీపతి, వివిధ విభాగాల అధ్యక్షులు ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.సాలూరు: ఈనెల 14న టిడిపి శంఖారావంలో భాగంగా పట్టణానికి వస్తున్న జాతీయ కార్యదర్శి లోకేష్ పర్యటనను విజయవంతం చేసేందుకు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్పీ భంజ్దేవ్ కోరారు. శనివారం ఆయన నియోజకవర్గ ఇన్చార్జి సంధ్యారాణితో కలిసి పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు పట్టణంలోని కొల్లి వారి పొలంలో బహిరంగ సభ జరుగుతుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరుకావాలని భంజ్దేవ్ కోరారు. సమావేశంలో సాలూరు మండల, పట్టణ, పాచిపెంట, మక్కువ, మెంటాడ మండలాల అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు, ఆముదాల పరమేష్, పిన్నింటి ప్రసాద్బాబు, గుల్ల వేణుగోపాలరావు, చలుమల్ల వెంకట్రావు, అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షులు కూనిశెట్టి భీమారావు,మండల నాయకులు బూస తవుడు పాల్గొన్నారు.