ప్రజాశక్తి- అనకాపల్లి : ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 20న ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని అనకాపల్లి జిల్లా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘం జెఎసి నాయకులు పిలుపునిచ్చారు. ఆదివారం అనకాపల్లి సిఐటియు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ, ఉద్యోగ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్న రూ.20 వేల కోట్లను వెంటనే చెల్లించాలని, 30 శాతం ఐఆర్ను ప్రకటించాలని, ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని, ఒపిఎస్ అమలు చేయాలని, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కోరుతూ ఎపి జెఎసి పిలుపులో భాగంగా విశాఖ కలెక్టరేట్ వద్ద ధర్నాలో పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధ్యాయులు పాల్గొనాలని కోరారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చినబ్బారు మాట్లాడుతూ ప్రభుత్వం కంటితుడుపు చర్యగా నియమించిన పిఆర్సి కమిటీ ఇంకా తన పనులు మొదలు పెట్టలేదన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మిగిలిన పిఆర్సి, డిఎ, పిఎఫ్, ఎపి జిఎల్ఐ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 28న చలో విజయవాడ ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎన్జిఒ నాయకులు లక్ష్మినారాయణ, నాగభూషణం, మహేష్, సురేష్, ఫణిభూషణం, జగదీష్, ఉమామహేశ్వరరావు, శాంబశివ, రవి, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘ నాయకులు సుధాకర్ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్నబ్బాయి