ప్రజాశక్తి – రాజగనగరం
ఆదికవి నన్నయ యూనివర్సిటీలో డిసెంబర్ 9 నుంచి 12వ తేదీ వరకూ సౌత్ అండ్ వెస్ట్ జోన్స్ ఇంటర్ యూనివర్సిటీ వెయిట్ లిఫ్టింగ్ మెన్ అండ్ ఉమెన్ ఛాంపియన్ షిప్ 2023 – 24 నిర్వహిస్తున్నామని విసి ఆచార్య కె.పద్మరాజు తెలిపారు. గురువారం యూనివర్సిటీలో వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ కు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా ఈపోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఎపి, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పాండిచ్చేరి, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, గోవా వంటి ప్రాంతాలలోని సుమారు 90 యూనివర్సిటీల నుంచి మెన్ టీమ్స్, 80 యూనివర్సిటీల నుంచి ఉమెన్ టీమ్స్ పాల్గొంటాయని చెప్పారు. నన్నయ విశ్వవిద్యాలయంలో తొలిసారిగా నిర్వహిస్తున్న విశ్వవిద్యాలయ స్థాయి జాతీయ క్రీడా పోటీలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలన్నారు. 9న యూనివర్సిటీ మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంలో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో మంత్రులు ఆర్కె.రోజా, మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తానేటి వనిత, ఎంపి మార్గాని భరత్ రామ్, ఎంఎల్ఎ జక్కంపూడి రాజా, ఎపి స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయర్ ఎడ్యుకేషన్ ఛైర్మన్ ఆచార్య కె.హేమచంద్రరెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఎపి వైస్ ఛైర్మన్, ఎండి పి.ధ్యానచంద్ర, సెంచూరియన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నోలజీ అండ్ మేనేజ్మెంట్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్.రాజు, జెఎన్టియుకె విసి ఫ్రొఫెసర్ జివిఆర్.ప్రసాదరాజు, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నింగ్ బాడీ మెంబర్, అర్జున అవార్డీ నీలంశెట్టి లక్ష్మీ, వెయిట్ లిఫ్టింగ్ ఒలింపియన్ ఎంవి.మాణిక్యాలు, తదితరులు పాల్గొంటారని తెలిపారు.