ప్రజాశక్తి -డుంబ్రిగుడ: అరకులోయ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ బాలికల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కిల్లో వసంత అనే విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న బాధిత కుటుంబాన్ని ఖండ్రుమ్ పంచాయతీ ఒంబిలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యురాలు కొర్రా రామలక్ష్మి గురువారం పరామర్శించారు. విద్యార్థిని తల్లిని ఓదార్చారు. 25 కిలోల బియ్యం, పప్పు నూనెను ఆమె అందజేశారు. ఈ సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయడానికి చర్యలు తీసుకుంటానని ఆమె భరోసా కల్పించారు. అనంతరం నందివలస బాలికల ఆశ్రమ, కేజీబీవీ పాఠశాలలు సందర్శించి విద్యార్ధుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షుడు కే.హరి, మాజీ ఎంపీటీసీ టీ.రామదాసు, శోభన్ బాబు పాల్గొన్నారు.