ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించి, నియంత్రణ చర్యలు చేపట్టగలిగామని ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. శనివారం ఆయన స్థానిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, జిల్లా పోలీస్ నిర్వర్తించిన లక్ష్యాలపై 2023 ప్రోగ్రెస్ను నివేదించారు. ఈ సంవత్సరం లో గంజాయి సంబందించి 266 కేసులు నమోదు చేశామని, అందులో 21785.29 కేజీలు, 16.775 కేజీల యాసిష్ అయిల్ని సీజ్ చేయడంతో పాటు 859 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ సంవత్సరంలో 248.94 ఎకరాలలో 11,68,100 ల గంజాయి మొక్కలని ద్వంసం చేసినట్లు తెలిపారు. 10290.5 ఎకరాలలో ప్రత్యామ్నాయ పంటలను రైతులకు కల్పించామన్నారు. ఈ సంవత్సరం లో ఐదుగురు మావోయిస్ట్ నేతలను, 21 మంది మిలిసియా సభ్యులని అరెస్ట్ చేసామన్నారు. 18 మంది మావోయిస్ట్ కొరియర్స్ పై బైండోవర్ కేసులని నమోదు చేసామన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం లో క్రైమ్ రేటు 9 శాతం తగ్గిందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం లో సారా, అక్రమ మద్యం దారులపై 675 కేసులు నమోదు చేసి, 738 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 11,422 లీటర్ల సారా సీజ్ చేసి, 1,71,620 లీటర్ల పులుపును ద్వంసం చేశామని చెప్పారు. మానవ హత్యలు 3.3శాతం, రోడ్డు ప్రమాదాలు 17.9శాతం తగ్గాయన్నారు.67 ప్రాపర్టీ కేసులు నమోదు కాగా. వాటిలో 35 కేసులు డిటెక్ట్ అయ్యి మరియు 33 మంది ముద్దాయిలను అరెస్ట్ వేసినట్లు తెలిపారు. 53 మంది గంజాయి ముద్దాయిలకు పీడీ యాక్ట్ విధించినట్లు తెలిపారు. 1500 మంది గిరిజనులకు అమృత జల ధార కార్యక్రమం ద్వారా నీటి సదుపాయం కల్పించినట్లు తెలిపారు. 9620 మంది గిరిజనులకు పరివర్తన కార్యక్రమం ద్వారా ఉచిత విత్తనాల పంపిణీ చేసామన్నారు. 450 మంది గిరిజనులకు గిరి కర్షక మిత్ర కింద ట్రాక్టర్లను సరఫరా చేస్తామని వెల్లడించారు.
![మాట్లాడుతున్న ఎస్పి తుహిన్సిన్హ](https://prajasakti.com/wp-content/uploads/2023/12/s-p-1.jpg)