ప్రజాశక్తి-పాడేరు: ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఆర్థిక బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రం పాడేరులోని ఐటీడీఏ కార్యాలయం ముందు యుటిఎఫ్ ఆధ్వర్యంలో గురువారం రిలే దీక్షలు చేపట్టారు. యుటిఎఫ్ జిల్లా సహా అధ్యక్షులు చీకటి నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ రిలే దీక్షలను ప్రారంభించారు. వివిధ మండలాల నుంచి యుటిఎఫ్ నాయకులు ఈ రిలే దీక్షలో పాల్గొన్నారు ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించవలసిన ఆర్థిక బకాయిలు డిఎ, ఎరియర్లు, సరెండర్ లీవులు, పిఫ్, ఎపిజిఎల్ఐ లోన్లు, 12వ పి.అర్సి, 30 శాతం ఐ.ఆర్ చెల్లించాలని దీక్షా శిబిరంలో ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఈ రిలే దీక్షలలో పాల్గొన్న యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వి.మహేశ్వరరావు మాట్లాడుతూ, ప్రభుత్వానికి ఎన్నో సార్లు ఉద్యోగుల సంఘాలు వినతులు, విజ్ఞప్తులు చేసినా ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలం కావడంతోనే రిలే దీక్షలు చేపట్టవలసి వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల ఆర్థిక బకాయిలు చెల్లించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పి.దేముడు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్.కన్నయ్య, సీనియర్ నాయకులు వి.వి. ఈశ్వరరావు, బి.సింహాచలం, టి.విజరు కుమార్, ఎస్.బాలకృష్ణ, నారాయణ, . ప్రవీణ్, పి.లింగన్న, జె.పద్మనాభం, జి.దుక్కు, బంటు. శ్రావణ్, రాంబాబు, టి.మేఘనాథ్, తులసీదాసు పాల్గొన్నారు .