జాశక్తి పాడేరు :సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల సిబ్బందికి అదనపు భద్రత కల్పిస్తామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పష్టం చేసారు. బుధవారం ఐటిడిఎ సమావేశ మందిరంలో పాడేరు నియోజకవర్గ సెక్టోరియల్ అధికారులతో నిర్వహించిన సమావేశం నిర్వహించారు. సెక్టోరియల్ అధికారులకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో లోటుపాట్లపై ఆరా తీసారు. సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు, సౌకర్యాలపై ఆరా తీసిన కలెక్టర్ మాట్లాడుతూ, సిగల్ లేని ప్రాంతాలకు సెక్టోరియల్ అధికారులకు సహాయకులుగా సిబ్బందిని నియమిస్తామని తెలిపారు. సిగల్ ఉన్న ప్రాంతం నుండి ఎన్నికల నియామావళి ప్రకారం ఓటింగ్కు ముందు మాక్ పోలింగ్, పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే జిల్లా ఎన్నికల అధికారికి, సంబంధిత సెక్టోరియల్ అధికారులకు అందించాలని ఆదేశించారు. ఎన్నికల విధులు బరువుగా భావించవద్దని, సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ హితబోధ చేసారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, రవాణా సదుపాయాలు, అందుబాటులో ఉన్న సమాచార వ్యవస్థలపై సెక్టార్ అధికారులకు అవగాహన ఉండాలని అన్నారు. ఎన్నికల సిబ్బందిని సకాలంలో పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు. తాగు నీటి సదుపాయం లేని పోలింగ్ కేంద్రాలకు కేన్ల ద్వారా నీటిని సరఫరా చేస్తామన్నారు. పోలింగ్ కేంద్రాలకు ర్యాంపులు, మరుగుదొడ్ల మరమ్మతులు చేపడతామని చెప్పారు. పోలింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోవాలని మధ్యలో ఎక్కడా వాహనాలు ఆగకూడదని చెప్పారు. ఈ సమావేశానికి హాజరు కాని సెక్టార్ అధికారులకు నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓ ను ఆదేశించారు. ఈ సమావేశంలో సముక్త కలెక్టర్ భావన, సబ్ కలెక్టర్ ధాత్రిరెడ్డి, డిఆర్ఓ వి.వి.రమణ, ఎస్.డి.సి.పి. అంబేద్కర్, పాడేరు నియోజక వర్గం ఆరు మండలాల సెక్టర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.