మండు వేసవిలో మంచు దుప్పటి

పాడేరులో కురుస్తున్న పొగమంచు

(ప్రజాశక్తి పాడేరు): మన్యం మంచు దుప్పటి కప్పుకుంది. అల్లూరి జిల్లా కేంద్రం పాడేరు పట్టణం చుట్టూ పరిసర గ్రామాల్లో గురువారం వేకువ జామున తెల్లారేసరికి శీతాకాలాన్ని తలపించే రీతిలో దట్టంగా పొగ మంచు కమ్మేసింది. శీతల గాలులు ఆహ్లాదపరిచాయి. పాడేరు ఏజెన్సీలో మే నెల ఆరంభం నుంచి భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. మండుటెండలతో పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉదయాన్నే చుర్రు మనిపించే ఎండ మధ్యాహ్నం మూడు గంటల వరకు తీక్షణంగా ఉంటున్నాయి. ఎండ తీవ్రతకు రోజు ఇటీవల 33 నుంచి 39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఈ తీవ్రమైన మండుటెండల్లో కూడా పాడేరు మన్యంలో రోజు పలుచోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు మండలాల్లో కురుస్తున్న వానలు 30 మిల్లీమీటర్ల వరకు నమోదు అవుతున్నాయి. సాయంత్రం పూట పడే వానలు రాత్రిపూట కురిసే మంచు తో మన్యంలో నెలకొన్న ఈ భిన్న వాతావరణం, మన్యవాసులను ఆహ్లాదపరుస్తూ మండుటెండలనుంచి మై మరిపిస్తోంది. ఆకాశంలో విహరిస్తూ అలసి సొలసి పాడేరు సమీపంలోని పర్వతాల కిందకు నేలకు ఒదిగి సేద తీరుతూ విశ్రమిస్తున్న ” పాసింగ్‌ క్లౌడ్స్‌” ఇప్పటికే రాష్ట్రం నలుమూలల ప్రజలను ఆకర్షించి ఆకట్టుకుంటున్నాయి. గత రెండేళ్లుగా ఈ ప్రాంతం ”వంజంగి హిల్స్‌” పేరుతో పర్యాటక కేంద్రంగా మారింది. ఇక్కడకు వచ్చే పర్యాటకులు భువికి దిగిన కైలాసగిరిగా ఈ ప్రాంతాన్ని అభివర్ణిస్తున్నారు. పాడేరు ఏజెన్సీ వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో విస్తరించిన కాఫీ తోటలుతో వీటికి నీడనిచ్చే తోటలు విస్తరణతో ఈ ప్రాంతమంతా ఏడాది పొడుగునా మూడు కాలాలను రోజు చవిచూసే ఒక శీతల కేంద్రంగా భిన్న వాతావరణానికి నెలవుగా మారింది.

➡️