ప్రజాశక్తి-ముంచంగిపుట్టు :ఓటు హక్కును అందరు సద్వినియోగం చేసుకోవాలని జి.మాడుగుల సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్, స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ రవీంద్రలు కోరారు. మండలంలోని పనసపుట్టు పంచాయితీలో వారు పర్యటించారు. ఈ సందర్భంగా సిఐ రమేష్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో పోలింగ్ బూత్ల ఏర్పాటు, ఓటర్లకు సౌకర్యంపై తెలిపారు. ఎన్నికల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని, మద్యం పంపిణీ, తరలింపు చేయరాదని కోరారు. చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. నాటు సారా తయారీ, విక్రయాలు చేయరాదన్నారు. గంజాయి తరలింపు, వ్యాపారులకు సహాయం వంటి వాటికి దూరంగా ఉండాలని తెలిపారు. మండలంలో యువత అత్యధికంగా గంజాయి పైలెటింగ్కు పాల్పడుతున్నారని, దీంతో భవిష్యత్తు కోల్పోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పనసపుట్ వైసిపి నేత తిరుపతి, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.