ప్రజాశక్తి -అనంతగిరి:తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ గిరిజన ప్రజలు ఖాళీ బిందెలతఓ వినూత్న రీతిలో చేతులు జోడించి మండలంలోని రొంపల్లి పంచాయతీ ఎగువగుడ్డి, గాదిలోవ గ్రామాల గిరిజన ప్రజలు ఆదివారం ఆందోళన చేపట్టారు. తాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని పలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ సోమ్మెల అప్పలరాజు, రైతు సహకార సంఘం ప్రతినిధులు కె. సింహాచలం, కె.సన్యాసిరావు మాట్లాడుతూ, తాగునీటి సౌకర్యం లేక మండుటెండల్లో సుదూర ప్రాంతంలో ఉన్న కలుషితమైన గెడ్డ నీటిని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. తక్షణమే తమ గ్రామాలకు పైపులైన్ లేదా బోరు బావుల ద్వారా తాగునీటి సరఫరా చేయలని వారు డిమాండ్ చేశారు. ఎర్రబోయిన వీధి నుండి ఎగ్గువగుడ్డి గ్రామానికి పైపులైన్ ఏర్పాటు చేసి మూడు టేప్లు ఏర్పాటు చేశారని, మరమ్మతుకు గురి కావడంతో కిలోమీటర్ దూరంలో ఉన్న గెడ్డకు వెళ్లి కలుషితమైన నీటిని తెచ్చుకొని ఆశ్రయించవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పి.సన్యాసమ్మ తదితరులు పాల్గొన్నారు.