ప్రజాశక్తి-యస్.రాయవరం:మండలంలోని పెద గుమ్ములూరు హైస్కూల్లో జిల్లా స్ధాయి చెకుముకి సైన్స్ సంబరాలు జన విజ్ఞానవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి కొలగాని వరప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 20 మండలాల నుండి 43 టీములు మొత్తం 153 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు ఆయన తెలిపారు. ఆదివారం ు జరిగిన ఈ పోటీలలో మొదటి స్థానం శ్రీ ప్రకాష్ విద్య నికేతన్(పాయకరావుపేట), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (వి.మాడుగుల),రెండవ స్థానం శ్రీ భవాని విద్యానికేతన్ (అచ్యుతాపురం),జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (వి.మాడుగుల),మూడవ స్థానం వాసవి బాలవిహార్ (అనకాపల్లి), జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొరుప్రోలు(యస్.రాయవరం) సాధించాయయన్నారు. ఈ పోటీలలో మొదటి స్థానం సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్ విద్యార్థులు విశాఖలో జరిగే చెకుముకి సైన్సు సంబరాలకి అర్హులని వరప్రసాద్ వివరించారు. సైన్స్ సంబరాలతో విద్యార్థులలో శాస్త్రీయ దృక్పధం పెంపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. జన విజ్ఞానవేదిక ప్రజా బాహుళ్యంలో విశేష ప్రజాదరణ పొందిన ఒక స్వచ్ఛంద సంస్ధ అని ఆయన పేర్కొన్నారు. అంతరం విజేతలకు జిల్లా ఉప విద్యాశాఖ అధికారి అప్పారావు, జిల్లా సైన్స్ అధికారి రాజారావు, జిల్లా కార్యదర్శి రాము, ఉపాధ్యక్షులు రామ్ కుమార్ సర్టిఫికెట్లు, మెమోంటోలు అందించారు.జిల్లా స్థాయిలో మొదటి స్థానం వచ్చిన వారంతా రాష్ట్ర స్థాయిలో కుడా విజేతలుగా గెలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు టి.నాగచంద్ర, కార్యదర్శి బి.రాము, ఉపాధ్యక్షులు బి.రామ్ కుమార్ పాల్గొన్నారు.
![గెలుపొందిన విద్యార్థులతో జెవివి ప్రతినిధులు, టీచర్స్](https://prajasakti.com/wp-content/uploads/2024/01/jvv.jpg)