ప్రజాశక్తి -నక్కపల్లి:స్థానిక మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం గ్రామ పంచాయతీల అభివృద్ధి ప్రణాళిక పై పంచాయతీ సర్పంచ్లు, ఉప సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఉపాధి, వెలుగు సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ అంబేద్కర్, ఏవో సీతారామరాజు, వైస్ ఎంపీపీ నానాజీ మాట్లాడారు. గ్రామ పంచాయతీల సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరానికి అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధికి అవసరమైన ప్రతి అంశాన్ని ఆర్థిక ప్రణాళికలో పొందుపరచాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన అంశాలతో పాటు ప్రకృతి విపత్తుల సమయంలో అవసరమైన అంశాలను కూడా ప్రణాళికలో పొందుపరచాలన్నారు. వార్షిక ప్రణాళికల తయారీలో భాగంగా నిర్వహించే గ్రామ సభలను విజయవంతంగా నిర్వహించడానికి ప్రాంతాల వారీగా ప్రజాప్రతినిధులతో పాటు, స్థానిక ప్రజల భాగస్వామ్యం చేయాలన్నారు.నర్సీపట్నంటౌన్:స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం గ్రామ పంచాయతీ, మండల పరిషత్ అబివృద్ధి ప్రణాళిక శిక్షణా తరగతులు ఎంపీడీవో జయ మాధవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎంపీడీవో జయ మాధవి మాట్లాడుతూ, 15వ ఫైనాన్స్ నిధులు ఏ విధంగా ఖర్చు పెట్టాలో ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని తెలిపారు.గ్రామ సభల నిర్వహించి గ్రామ కమిటీల ఆధ్వర్యంలో ప్రణాళికను సిద్ధం చేయాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల రాజేశ్వరి, అధికారులు, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. కోటవురట్ల: మండల పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ఈఓపిఆర్డి భానుజీరావు పంచాయతీ అభివద్ధి ప్రణాళిక పై శిక్షణ ఇచ్చారు. పంచాయతీ అభివృద్ధికి నిధుల వినియోగం పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రధానంగా పారిశుద్ధ, తాగునీటి సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రధాన సమస్యలు గుర్తించాలని ఆయా శాఖల అధికారులకు తెలియజేయాలన్నారు. మంజూరైన నిధులు సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శులు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.
![నక్కపల్లిలో శిక్షన ఇస్తున్న అధికారులు](https://prajasakti.com/wp-content/uploads/2024/01/train-in-g.jpg)