లలితమ్మ పార్థివదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి
ఉరవకొండ టౌన్ : అనంతపురం జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్సీ శివరామిరెడ్డి మాతృమూర్తి ఎల్లారెడ్డి లలితమ్మ(85) వయోభారం, అనారోగ్య సమస్యలతో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. గురువారం నాడు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం కొనకొండ్ల గ్రామంలో ఆమె అంత్యక్రియలను నిర్వహించారు. లలితమ్మ మృతి విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి గురువారం మధ్యాహ్నం కొనకొండ్ల గ్రామానికి చేరుకున్నారు. ఎమ్మెల్సీ శివరామిరెడ్డి నివాసంలో లలితమ్మ పార్థవదేహానికి నివాళులు అర్పించారు. లలితమ్మకు ఐదుగురు కుమారులు కాగా వారందరూ చట్టసభల్లో ప్రాతనిధ్యం వహిస్తున్నారు. శివరామిరెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా, సాయిప్రసాద్ రెడ్డి, బాలనాగిరెడ్డి, వెంకట్రామిరెడ్డిలు ఆదోని, మంత్రాలయం, గుంతకల్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మరోసోదరుడు సీతారామిరెడ్డి టిటిడి బోర్డు సభ్యునిగా ఉన్నారు. ముఖ్యమంత్రి వీరిని పరామర్శించి సానుభూతి తెలియజేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి ఉషశ్రీచరణ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, శంకరనారాయణ, జెడ్పీ ఛైర్పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తదితరులు లలితమ్మకు నివాళులు అర్పించారు.