ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిరసన తెలుపుతున్న సిపిఎం నాయకులు
అనంతపురం కలెక్టరేట్ : దేశంలో రాజ్యాంగ ఉల్లంఘటనలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయని సిపిఎం నగర 1వ కమిటీ కార్యదర్శి వి.రామిరెడ్డి తెలిపారు. బిజెపి ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తూ పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం, సభాహక్కులను కాల రాయడాన్ని నిరసిస్తూ సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో అనంతపురం ఆర్టిసి బస్టాండ్ కూడలిలో శుక్రవారం ఉదయం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందన్నారు. పార్లమెంట్ చరిత్రలోనే అసాధారణమైన రీతిలో ప్రతిపక్ష పార్టీల ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడం అత్యంత దుర్మార్గం అన్నారు. 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసి ప్రతిపక్షాల గొంతు నొక్కిన ఘనత మోదీ ప్రభుత్వానికికే దక్కిందన్నారు. బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపే మేధావులు, మీడియా సంస్థలు, కళాకారులుపై దాడులు నిత్యకృత్యం అయ్యాయని మండిపడ్డారు. అప్రజాస్వామిక పాలన సాగిస్తున్న మోడీ ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ముస్కిన్, వలీ, ప్రకాష్, ఎన్టీఆర్.శీనా, ఇర్ఫాన్, లక్ష్మినారాయణ, ఎర్రిస్వామి, శివ, ఆది, గపూర్, బాలకృష్ణ, నాగరాజు, ఫకృ, ఇస్మాయిల్, వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు.