బైకు ర్యాలీ నిర్వహిస్తున్న తమ్ముళ్లు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
అనంతపురంలో టిడిపి హయాంలో చేసిన అభివృద్ధిని వైసిపి నాయకులు తాము చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్చౌదరి అన్నారు. శుక్రవారం రుద్రంపేట పంచాయతీలోని వికలాంగుల కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇద్దరు నేతల కలయికతో కార్యకర్తలు, నాయకుల్లో జోష్ కనిపించింది. ఇందులో భాగంగా ప్రభాకర్చౌదరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకు సాగారు. ఈసందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ తాము ప్రజల్లోకి వెళ్తుంటే ప్రతి పనీ టిడిపి హయాంలోనే జరిగిందని చెబుతున్నారన్నారు. తమకు వస్తున్న స్పందన చూస్తుంటే కచ్చితంగా భారీ విజయం ఖాయమనిపిస్తోందన్నారు. ప్రభాకర్చౌదరి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలంతా వైసిపి అరాచక పాలన పోవాలని కోరుకంటున్నారన్నారు. ప్రశాంతమైన వాతావరణం రావాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సిఎంను చేసుకోవాలన్నారు. నగరంలో జరిగిన జాతీయ రహదారి విస్తరణ పనులు, సుభాష్రోడ్డు పనులన్నీ టిడిపి హయాంలోనే మంజూరయ్యాయని గుర్తు చేశారు. తాను నగరానికి తాగునీటి సమస్య లేకుండా చేస్తే.. చిన్న మోటార్ రిపేరు వచ్చిందని 10రోజులపాటు తాగునీరు ఇవ్వలేని దుస్థితిలో వైసిపి ప్రభుత్వం ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావున వచ్చే ఎన్నికల్లో టిడిపికి ఓటు వేసి దగ్గుపాటిని గెలిపించడంతోపాటు చంద్రబాబును సిఎంను చేసుకుందామని పిలుపునిచ్చారు.
అనంతలో బీసీ భవన్ నిర్మిస్తాం..
టిడిపి అధికారంలోకి రాగానే అనంతపురంలో బీసీ భవన్ నిర్మిస్తామని దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. శుక్రవారం నగరంలోని యాదవ్ ఫంక్షన్ హాల్లో బీసీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల కోసమే టిడిపి పుట్టిందన్నారు. దీంతోనే పార్టీ ఆవిర్భావం నుంచి బిసిలకే పెద్దపీట వేస్తోందన్నారు. గతంలో జగన్ చెప్పిన మాయమాటలు నమ్మి కొందరు బీసీలు గత ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేశారని, ఈసారి మాత్రం ఆ తప్పు చేయరన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ, టిడిపి జిల్లా అధ్యక్షులు వెంకటశివుడుయాదవ్, బిసి నాయకులు ఆవుల కృష్ణయ్య, తలారి ఆదినారాయణ, దళవాయి వెంకట నారాయణ, జోగి రాజేంద్ర, పోతుల లక్ష్మీనరసింహులు, జనసేన నాయకులు జయరామ్రెడ్డి, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీతో కదం తొక్కిన టీడీపీ శ్రేణులు
అనంత ప్రజలారా ఇంటి నుంచి బయటకు రండి.. ఈ అరాచక ప్రభుత్వానికి ఓటు ద్వారానే బుద్ధి చెప్పండంటూ అనంతపురం అర్బన్ టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం దగ్గుపాటి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ అర్బన్ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన రాంనగర్ ఫ్లైఓవర్, అంబేద్కర్ విగ్రహం, సప్తగిరి సర్కిల్, ఐరన్ బ్రిడ్జి, వన్ టౌన్ పీఎస్, గాంధీ సర్కిల్, శ్రీకంఠం సర్కిల్, టవర్ క్లాక్ మీదుగా బళ్లారి బైపాస్ వరకు సాగింది. సుమారు 3వేల మంది యువకులు ద్విచక్రవాహనాల్లో టీడీపీ జెండాలు పట్టుకుని ప్రదర్శనగా వచ్చారు. దగ్గుపాటి ముందుకు కదలగా.. వెనుక టీడీపీ శ్రేణులంతా సైనికుల్లా తరలివచ్చారు. జై దగ్గుపాటి అన్న నినాదాలో నగరమంతా మారు మ్రోగేలా చేశారు. ఈ సందర్భంగా దగ్గుపాటి మాట్లాడుతూ నగరంలో యువత ఉత్సాహాం చూస్తుంటే.. తమ విజయం భారీ స్థాయిలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబుని ముఖ్యమంత్రి చేసుకోవాలన్న తపన యువతలో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నగరంలో తాగునీటి సమస్యలు నెలకొన్నాయని తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తుందని పీఏబిఆర్ నుంచి నగరానికి సరిపడా నీరు తీసుకొస్తామన్నారు.