హోమ్ ఓటింగ్పై అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్ కుమార్
అనంతపురం కలెక్టరేట్ : సాధారణ ఎన్నికలకు సంబంధించి హోమ్ ఓటింగ్ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా||వి.వినోద్ కుమార్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం రాప్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని కురుగుంట వద్దనున్న అన్నె ఫెర్రర్ కాలనీలో హోమ్ ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హోమ్ ఓటింగ్ ప్రక్రియను సకాలంలో వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అనంతపురం రూరల్ మండలంలో హోమ్ ఓటింగ్ కింద 39 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 11 మందితో ఓటింగ్ పూర్తి చేయించినట్లు చెప్పారు. మిగిలిన వారితో కూడా త్వరగా ఓటు వేయించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిసైడింగ్ ఆఫీసర్ దివాకర్ రెడ్డి, లోకల్ సెక్టోరియల్ అధికారి, బిఎల్ఒలు పాల్గొన్నారు.