రీటా నేర్పిన పాఠం పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ నాయకులు
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆల్ ఇండియా వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి నీలిమ మైత్రా ఆశయాలు కొనసాగిస్తామని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులు ఎస్.నాగేంద్రకుమార్, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శకుంతల, రమాదేవి అన్నారు. శనివారం సిఐటియు జిల్లా కార్యాలయంలో 12నన మృతిచెందిన అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి నీలిమ మైత్రా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీలిమ మైత్ర అంగన్వాడీ యూనియన్ స్థాపించడంలో కీలక పాత్ర వహించారని తెలిపారు. అంతేగాకుండా ఆల్ ఇండియా కార్యదర్శిగా అధ్యక్షులుగా అనేక సంవత్సరాలు పని చేశారని తెలిపారు. నిరంతరం కార్మిక సమస్యలపై అలుపెరగని పోరాటాలు కొనసాగించారని కొనియాడారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ వర్కింగ్ ఉమెన్ వ్యవస్థానలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే వారికే తమ మద్దతు ఉంటుందన్నారు. అనంతరం బృందాకరత్ ఉద్యమ జ్ఞాపకాల ‘రీటా నేర్పిన పాఠం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి జమున, ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు అరుణ, మేరీ, కాత్యాయని, పాతక్క, విజయనిర్మల, సత్యవతి, గోవిందమ్మ, రమణమ్మ, రాధమ్మ, విజయనిర్మల, సత్యవతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.