వృద్ధుడిని ఓటు అభ్యర్థిస్తున్న టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్
ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్
సిఎం జగన్రెడ్డీ.. ఇకనైనా పండుటాకులు పింఛన్దారులపై కుట్రలు ఆపు.. లేకుండా పుట్టగతలుండవు..’ అంటూ అనంతపురం అర్బన్ టిడిపి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం నగరంలోని 4, 5వ డివిజన్ల పరిధిలోని రెవెన్యూ కాలనీ, రామచంద్ర నగర్, ఖాజానగర్, శ్రీనివాస్నగర్, చేపలగుంట ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ఇందులో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ అధికారంలోకి వస్తే అమలు చేయనున్న పథకాలను వివరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ మేనిఫెస్టోపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతోపాటు అన్నివర్గాలకూ మేలు చేసే విధంగా ఉందన్నారు. కాగా సిఎం జగన్ ఉద్దేశపూర్వకంగానే పింఛన్దారులను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్ర పూరితంగానే పింఛన్ సొమ్మును బ్యాంకుల్లో వేసి వృద్ధులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, మీ కుట్రలకు ఎన్నికల్లోనే సమాధానం చెబుతారని ఆయన స్పష్టం చేశారు. మాజీ మేయర్ స్వరూప, దేరంగుల వెంకటాద్రి, టిడిపి నగర్ ప్రధాన కార్యదర్శి ముక్తియారు, టిడిపి మైనార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఫిరోజ్, కృష్ణం రఘు, జయప్రకాశ్, టిడిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.