డిసెంబర్ 8 నుండి అంగన్వాడీల రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె

Nov 18,2023 16:27 #Anganwadi Workers, #Kakinada, #Protest

ప్రజాశక్తి-కాకినాడ : 4ఏళ్ల నుండి పెండింగులో పెట్టిన అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆర్డిఓ ఆఫీస్ పక్కన కాకినాడ అర్బన్, రూరల్ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఒకరోజు రిలే నిరాహార దీక్షను సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషాబాబ్జి ప్రారంభించి మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా అంగన్వాడీలకు వేతనం చెల్లిస్తానన్న జగన్మోహన్ రెడ్డి హామీ అమలు చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు అంగన్వాడీలకు చెల్లించాలని, 2017 నుండి బకాయి పెట్టిన టిఏ బిల్లులు చెల్లించాలని, మినీ వర్కలను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు చెల్లించాలని కోరుతూ డిసెంబర్ 8వ తేదీ నుండి అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు తెలిపారు. అనంతరం ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) రాష్ట్ర అధ్యక్షురాలు జి.బేబిరాణి మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా వేలాది అంగన్వాడీ సెంటర్లను మెర్జ్ చేశారని, నూతన విద్యా విధానం పేరుతో ఉన్న సెంటర్లను సైతం పాఠశాలల్లో విలీనం చేయడంవల్ల రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల ప్రజల పిల్లలకు పౌష్టికాహారం దూరమవుతుందని విమర్శించారు. బాలింతల ఇంటికి వెళ్లి ఫేస్ రికగ్నైజింగ్ చేసే యాపుల పని అంగన్వాడీలకు భారంగా మారిందన్నారు. సెంటర్లు వదిలేసి ఎఫ్.ఆర్.సి యాప్ పేరుతో ఇళ్ల చుట్టూ తిప్పుతూ, అధికారులు, రాజకీయ నాయకులు విజిట్ల పేరుతో సెంటర్ కి వచ్చే సమయంలో అంగన్వాడీ కనపడకపోతే మెమోలు ఇస్తూ అంగన్వాడీలను మానసిక వేదనకు, రాజకీయ వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. తక్షణం అన్ని యాప్లను కలిపి ఒకే యాప్ గా మార్చాలని డిమాండ్ చేశారు. ఆయాల ప్రమోషన్ వయస్సు 50సంవత్సరాలకు పెంచాలని, ప్రమోషన్ల విషయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను సైతం పక్కనపెట్టి నిబంధనలకు విరుద్డంగా కాకినాడ నగర ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ధరలు కనుగుణంగా కనీస వేతనం 26 వేల రూపాయలు అంగన్వాడీలకి చెల్లించాలన్నారు. రిలే దీక్షలను నిమ్మరసం ఇచ్చి కాకినాడ నగర అధ్యక్షులు పలివేల వీరబాబు, జిల్లా కోశాధికారి మలకా రమణ విరమింపజేశారు. దీక్షలకు మద్దతుగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడారు. ఒకరోజు రిలే దీక్షలలో ప్రాజెక్ట్ నాయకులు ఎంకే జ్యోతి, ఎం రాజేశ్వరి, వి.వీరవేణి, సిహెచ్ రమ, ఎండి సుఫియా బేగం, మున్నిరున్నిసా, వి.రమాదేవి, ఎంవీఎస్. నాగమణి, జోగమ్మ, సౌభాగ్య, చామంతి కుమారి, అప్పలకొండ, వీరవేణి, ఎస్.వరలక్ష్మి మరొక 30మంది దీక్షలలో పాల్గొన్నారు.

➡️