ప్రజాశక్తి – ఉండ్రాజవరం(తుర్పుగోదావరి) : తమ సమస్యల పరిష్కారం కోసం మండలంలోని అంగన్వాడి కార్మికులు మండల కేంద్రం ఉండ్రాజవరం తహసిల్దార్ కార్యాలయం వద్ద గురువారం సమ్మె చేపట్టారు. ఈ కార్యక్రమంలో 63 మంది టీచర్లు, 61 మంది ఆయాలు మోకాళ్లపై నిలబడి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉండ్రాజవరం సెక్టార్ లీడర్ ఎస్ రంగనాయక మాట్లాడుతూ అన్నం పెట్టే వారికి అన్నం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. సుమారు 20 సంవత్సరాల పైబడి అనుభవం ఉన్న తమకు కూడా అత్యంత తక్కువ వేతనాలు రావడంతో జీవనం సాగేదెలా అని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి, మాట నిలబెట్టుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల న్యాయమైన కోరికలు నెరవేరేవరకు నిరవధిక సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెరవలి ప్రాజెక్టు ప్రెసిడెంట్ కే లక్ష్మి కుమారి, ఉండ్రాజవరం సెక్టార్ లీడర్ ఎం జానకి, కె ఎన్ ఎస్ ప్రసన్నకుమారి, హెల్పర్లు కె విజయ కుమారి, కె వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/east-godavai.jpg)