న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీ బీహార్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇండియా బ్లాక్ని తీవ్రంగా విమర్శించారు. శనివారం పాట్నాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ మాట్లాడుతూ.. ‘ఇండియా బ్లాక్లోని నాయకులందరూ ఎల్లప్పుడూ తమ కుటుంబాలను ముందు ఉంచుతారు. ఇందులోని వ్యక్తులు మతతత్వ, కులతత్వ రాజకీయాలకు పాల్పడతారు. వీరంతా రాజవంశీయులు’ అని ఆయన మండిపడ్డారు. ఈ లోక్సభ ఎన్నికలు కేవలం ఎంపీలను ఎన్నుకునేందుకు కాదు. దేశానికి ప్రధానమంత్రిని ఎన్నుకునేవి. మీ ఓటు చాలా శక్తివంతమైనది. భారతదేశానికి ప్రధానమంత్రి అంటే ఎలా ఉండాలి? భారత్ శక్తిని ప్రపంచం ముందు చూపగలిగేలా ఈ దేశ ప్రధాని ఉండాలి. అలాంటి ప్రధానిని ఈ ఎన్నికల్లో మీరు ఎన్నుకోవాలి.’ అని మోడీ అన్నారు.