ప్రజాశక్తి – బి.కొత్తకోట : అంగన్వాడీలు తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేపట్టిన నిరవధిక సమ్మె 40వ రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా 40వ రోజైన శనివారం పట్టణంలోని జ్యోతి చౌక్ నందు మానవహరంగా ఏర్పడే ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కనీస వేతనం అమలు, గ్రాట్యూటీ అమలు, మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించడం,నాణ్యమైన పౌష్టికాహారం సరఫరా చేయడం, హెల్పర్లకు పదోన్నతులు కల్పించడం తదితర సమస్యలను పరిష్కరించాలని వారు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. చాలీచాలని జీతాలతో తాము జీవితాలు గడుపుతున్నామని,మా సమస్యలు పరిష్కరించమని కోరితే కక్షపూరిత ధోరణితో వ్యవహరించడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి మా డిమాండ్లను పరిష్కరించి, న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మెలో అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఎస్ మనోహర్ రెడ్డి ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ సలీం భాష, సిపిఐ సీనియర్ నాయకులు బషీర్ ఖాన్, సిపిఐ పట్టణ కార్యదర్శి ఎం.అష్రఫ్ అలీ, ఏఐటీయూసీ నాయకులు జి.రఘునాథ్, ఎస్. తంబయ్య శెట్టి. వలి తదితరులు పాల్గొన్నారు.