ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : గుంటూరు రేంజి ఐజిగా ఏలూరు రేంజి ఐజి జీవీజీ అశోక్ కుమార్కు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఐజి పాలరాజ్ను డిజిపి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.
పల్నాడు ఇన్ఛార్జి ఎస్పీగా రాఘవేంద్ర
జిల్లాపల్నాడు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీగా ఆర్.రాఘవేంద్ర బుధవారం బాధ్యతలు చేపట్టారు. నూతన జిల్లాలు ఏర్పడిన నాటి నుండి పల్నాడు జిల్లా ఎస్పీగా వై.రవిశంకర్రెడ్డి పనిచేస్తూ వచ్చారు. అయితే గతనెల 17న చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని బొప్పూడి వద్ద జరిగిన ప్రజాగళం సభలో భద్రతా వైఫల్యాల నేపథ్యంలో జిల్లా ఎస్పీ వై.రవిశంకర్రెడ్డిని ఎన్నికల సంఘం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు విధులకు హాజరు కాకూడదని నిబంధనలు విధించింది. ఎస్పీ తర్వాత స్థాయి అధికారులు బాధ్యతలు స్వీకరించాలనే ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఇప్పటి వరకు అదనపు ఎస్పీ (అడ్మిన్)గా వ్యవహరిస్తున్న ఆర్.రాఘవేంద్ర బుధవారం బాధ్యతలు చేపట్టారు. తదుపరి నియామక ఆదేశాలు వచ్చేంత వరకు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి ఎస్పీగా రాఘవేంద్ర కొనసాగనున్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/9-2.jpg)