ఎన్నికల కమిషన్ విధి విధానాలు తప్పని సరిగా పాటించాలి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ఎన్నికల కోడ్ ప్రారంభం కాగానే ఎలక్షన్ కమిషన్ విధివిధానాలను తప్పనిసరిగా పాటించాలని ఏడు నియోజక వర్గాలకు సంబంధించి ఎన్నికల మెటీరియల్ డిస్పాచింగ్ సెంటర్ల ఏర్పాటు, కౌంటింగ్ కేంద్రంగా చిత్తూరులోని ఇంజనీరింగ్ కళాశాల, ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకోవాలని, అందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు కోరారు. ఎన్నికలకు సంబంధించి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమాలను అనుసరించాలని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేలా అందరూ సహకరించాలని, ఎన్నికల మెటీరియల్ నియోజకవర్గ కేంద్రాలలోని ఎంపిక చేసిన కేంద్రాల నుంచి విడుదల చేస్తామని జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి ఓటర్లు నమోదు ప్రక్రియ మార్పులు చేర్పులు జరుగుతున్నాయని నామినేషన్ల పర్వం ప్రారంభం అయ్యే వారం రోజుల ముందు వరకు నమోదు ప్రక్రియ జరుగుతుందన్నారు. ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత కమిషన్ ఆదేశాల మేరకు పని చేయాల్సి ఉంటుందని ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించుకునేలా అందరూ సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితాలకు సంబంధించి పలు పత్రికలలో వచ్చిన వార్తలకు ప్రతిస్పందించి విచారణ పూర్తి చేశామన్నారు. క్లెయిమ్స్ ఏవైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపారు. ఎన్నికల మెటీరియల్స్కు సంబంధించి నియోజకవర్గ కేంద్రాల నుంచి పంపిణీ చేస్తారని పుంగనూరులోని బిఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నగరి, గంగాధర నెల్లూరులోని జిల్లా పరిషత్ హైస్కూల్, పూతలపట్టు నియోజకవర్గానికి సంబంధించి శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల నుంచి, పలమనేరుకు సంబంధించి చెన్నారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి, కుప్పం నియోజకవర్గానికి సంబంధించి ఎంఎస్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుంచి ఎన్నికల సామగ్రిని పంపిణీ చేస్తారన్నారు. ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి చిత్తూరులోని రెండు కళాశాలలను ప్రతినిధులకు తెలుపగా ప్రతినిధులు అందరూ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలను కౌంటింగ్ కేంద్రంగా ఎంపిక చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఎన్నికల సామగ్రి ఇవ్వడం, బ్యాలెట్ బాక్సులు తీసుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, బిజెపి నుంచి అట్లూరి శ్రీనివాసులు, కాంగ్రెస్ నుంచి ప్రతినిధిగా పరదేశి, ఆప్ నుంచి వినాయకన్, సిపిఎం నుంచి గంగరాజు, వైసిపి నుంచి ఉదరు కుమార్, టిడిపి నుంచి సురేంద్ర కుమార్లు పాల్గొన్నారు.
![ఎన్నికల కమిషన్ విధి విధానాలు తప్పని సరిగా పాటించాలి జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-1333333333.jpg)