టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిప్రజాశక్తి- చిత్తూరు డెస్క్: బుగ్గ అన్నపూర్ణసమేత కాశీవిశ్వేశ్వరాలయం చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయమని పవిత్రమైన ఈ ప్రాంతంలో పెళ్లిల్లు చేసుకునే అవకాశం స్థానిక ప్రజలకు కల్పించాలన్న సంకల్పమే నేడు టీటీడీ కళ్యాణ మండపం ఈ ప్రాంతంలో రావడానికి కారణమైందని రాష్ట్ర పర్యాటక, సాంస్కతిక, యువజన సర్వీసుల క్రీడాశాఖ మంత్రి ఆర్కేరోజా అన్నారు. బుధవారం ఆలయ ఆవరణలో రూ.2 కోట్ల నిధులతో నిర్మించే టీటీడీ కళ్యాణ మండపానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డితో కలిసి ఆమె భూమిపూజ చేశారు. చారిత్రక బుగ్గ దేవాలయాన్ని అభివద్ధి చేస్తామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి అన్నారు. టీటీడీ కళ్యాణమండం భూమిపూజకు విచ్చేసిన ఆయన మాట్లాడుతూ నేడు మహత్తర కార్యక్రమానికి హాజరుకావడం ఆనందదాయకమన్నారు. అతి తక్కువ ఖర్చుతో స్థానిక ప్రజలు వివాహం జరిపించుకునే అవకాశాన్ని కల్పించాలన్న మంత్రి రోజా భగీరథ ప్రయత్నం నేడు ఫలించిందన్నారు. ఉన్నది ఉన్నట్లు నిజాయితీగా మాట్లాడే వ్యక్తి మంత్రి రోజా అన్నారు. ఆమె ఈ ప్రాంతంలో టీటీడీ కళ్యాణ మండపం కట్టాలని కోరడం దాన్ని వెంటనే ఆమోదించడం జరిగిందన్నారు. ఆమె అడిగిన మరిన్ని అభివద్ధి పనులు కూడా ఆమె నుంచి ప్రతిపాదనలు రాగానే వందశాతం నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. పురాతణమైన ఆలయాలవిషయంలో టీటీడీ నిధులు కేటాయించడంలో స్పష్టంగా ఉందన్నారు. తప్పక అభివద్ధిచేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవో నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ రమేష్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
![చారిత్రక బుగ్గ దేవాలయాన్ని అభివద్ధి చేస్తాం](https://prajasakti.com/wp-content/uploads/2024/02/Untitled-1-copy-127.jpg)