పక్కాగా దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలన.. సమావేశంలో మాట్లాడుతున్న నగర కమిషనర్ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ -2024 కార్యక్రమంలో భాగంగా డిసెంబర్9వ తేదీ వరకు అందిన దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను పక్కాగా, వేగంగా పూర్తిచేయాలని ఈఆర్వో, ఆర్డీవో చిన్నయ్య, ఏఈఆర్వో కమిషనర్ డాక్టర్ జె.అరుణ చెప్పారు. మంగళవారం నగరపాలక కార్యాలయంలో బిఎల్వోలు, సూపర్వైజర్ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఆర్ఓ, ఏఈఆర్వోలు మాట్లాడుతూ డిసెంబర్ 9వ తేదీ వరకు అందిన ఫారం-6, 7, 8 దరఖాస్తులను క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రతి దరఖాస్తు, దరఖాస్తుతో పాటు జతచేసిన సర్టిఫికెట్లను పరిశీలించి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సక్రమంగా ఉన్న వాటిని ఆమోదించి అప్లోడ్ చేయాలన్నారు. సూపర్వైజర్ అధికారులు వారి పరిధిలోని దరఖాస్తు పరిశీలన కార్యక్రమాన్ని తనిఖీ చేయాలన్నారు. బిఎల్వోలు, సూపర్వైజర్ అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా తప్పులు లేని తుది ఓటర్ల జాబితాను తయారు చేయాలన్నారు. జీరో డోర్ నెంబర్లు, డబుల్ ఎంట్రీలు తదితర దరఖాస్తులను జాగ్రత్తగా పరిశీలించాలని, పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. సమావేశంలో సహాయ కమిషనర్ గోవర్థన్, సీఎంఎం గోపి తదితరులు పాల్గొన్నారు.