రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం..12 గంటల ధర్నా లో యుటిఎఫ్ నేతల హెచ్చరిక ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి పరిష్కరించకుంటే జగన్ ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని యుటిఎఫ్ నేతలు జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బుధవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు స్థానిక కట్టమంచి చెరువు వివేకానంద విగ్రహం ఎదుట యుటిఎఫ్ ఆధర్యంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా యుటిఎఫ్ నాయకులు రఘుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి జివి.రమణ, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎం.సోమశేఖర నాయుడు ఎన్. మణిగండన్, మాట్లాడుతూ ‘మేము అడుగుతున్న సొమ్ము బడ్జెట్ సొమ్ము కాదు.. మా సొంత సొమ్ము.. మా సొమ్ముపై ఎవరి పెత్తనం అంగీకరించం.. సంవత్సరాలు తరబడి బకాయిలా… రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మా బకాయిలకు ఏమి సంబంధం లేదు. మా డబ్బు ఎప్పుడు ఇస్తారో’ చెప్పాలన్నారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో సకాలంలో డిఏలు, మెరుగైన పిఆర్సి, ప్రతి సంవత్సరం జనవరిలో డీఎస్సీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ రెగ్యులేషన్, నిర్బంధాలు ఉద్యోగులపై ఉండవని, స్నేహపూరిత వాతావరణంలో ఈ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తుందని బైబిల్, ఖురాన్, భగవద్గీత ప్రజలనే కాదు… దేవుళ్ళను మోసం చేయడమే అవుతుందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు తాను మేధావిగా ప్రకటించుకున్న జయప్రకాష్ నారాయణ పాతపెన్షన్ ఇస్తే ఆర్థిక పరిస్థితి తీవ్రసంక్షోభంలో పడుతుందని చెప్తున్నారని, గత పది సంవత్సరాలుగా 15లక్షల కోట్ల రూపాయలు కార్పొరేట్ల పన్ను రాయితీ ఇవ్వటం ద్వారా ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తం కాదా అని ప్రశ్నించారు. మీరు ప్రజల పక్షాన కార్పొరేట్లు పక్షాన స్పష్టం చేయాలని, మీ ముసుకు తొలగించాలని, లేకుంటే మేము తొలగిస్తామన్నారు. కార్యక్రమంలో యుటిఎఫ్ నాయకులు పిఆర్.మునిరత్నం, రెహానా బేగం, ప్రసన్న కుమార్, రఘుపతి రెడ్డి, దీనావతి, ఎస్పి బాషా, సీపీ ప్రకాష్, జగన్ మోహన్రెడ్డి, కష్ణమూర్తి రెడ్డెప్ప నాయుడు, దక్షిణా మూర్తి, ఈశ్వర్ మహేంద్ర, డి.ఏకాంబరం, సరిత, పంటపల్లి సురేష్, గణేష్ కుమార్, పిసి బాబు, ఎంవి రమణ, శశి కుమార్, మోహన్, శేఖర్ పాల్గొన్నారు.
![రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం..12 గంటల ధర్నా లో యుటిఎఫ్ నేతల హెచ్చరిక](https://prajasakti.com/wp-content/uploads/2024/01/666666666666666666-2.jpg)